
గిరిజనుల తిరుగుబాటు
● పాత ఊళ్లకు తరలిన రాంపూర్, మైసంపేట్ వాసులు ● పరిహారం కోసం పోరుబాట ● పాత ఊరిలో గుడిసెలు, అక్కడే మకాం
కడెం: కడెం మండలం రాంపూర్, మైసంపేట్ గ్రామాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా కోసం ఖాళీ చేయించి ఏడాది గడిచింది. అయినా పునరావాస ప్యాకేజీలో భాగంగా హామీ ఇచ్చిన పరిహారం, సౌకర్యాలు అందకపోవడంతో గ్రామస్తులు తిరుగుబాటు ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో నిర్వాసితులు తమ పాత ఊళ్లకు తిరిగి వెళ్లి, గుడిసెలు వేసుకుని మకాం పెట్టారు.
పునరావాసంలో అసంతృప్తి
గతేడాది ఏప్రిల్లో అటవీ శాఖ రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ఖాళీ చేయించి, కడెం మండలం పాతమద్దిపడగ సమీపంలో పునరావాస కాలనీకి తరలించింది. ఈ గ్రామాల్లోని 142 కుటుంబాల్లో 94 కుటుంబాలకు ప్యాకేజీ–1 కింద రూ.11.80 కోట్లతోపాటు 5 హెక్టార్ల విస్తీర్ణంలో విద్య, విద్యుత్, తదితర సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో 94 కుటుంబాలకు వ్యవసాయ భూములు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మిగిలిన 48 కుటుంబాలకు ప్యాకేజీ–2 కింద రూ.15 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ హామీలు పూర్తిగా అమలు కాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
పునరావాస ప్రక్రియలోని లోపాలను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి.
● కేటాయించిన భూములను సాగుకు అనుకూలంగా చదును చేయాలి.
● వ్యవసాయ భూములకు త్రీ–ఫేజ్ విద్యుత్ సౌకర్యం, సాగు నీటి వసతి కల్పించాలి.
● భూములకు వెంటనే రెవెన్యూ పట్టాలు అందజేయాలి.
● 48 కుటుంబాలకు రూ.15 లక్షల నగదు పరిహారం పూర్తిగా అందించాలి.
● 94 కుటుంబాలకు ఉపాధి కోసం రూ.3 లక్షల రుణం అందజేయాలి.
● పునరావాస కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించాలి.
● పునరావాస కాలనీని గ్రామ పంచాయతీగా గుర్తించాలి.
పాత గ్రామాల్లో గుడిసెలు..
పరిహారం, సౌకర్యాలు అందకపోవడంతో గ్రామస్తులు తమ పాత గ్రామాలైన రాంపూర్, మైసంపేట్లకు తిరిగి వెళ్లి గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేశారు. వంటవార్పు చేసుకుంటూ అక్కడే ఉంటామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆందోళన చెందొద్దు
రాంపూర్, మైసంపేట్ వాసులు ఆందోళన చెందొద్దు.పు నరావాస గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పూర్తిస్థాయి ప్యాకేజీ త్వరలో అందజేస్తాం. పట్టాలు ప్రింటింగ్ దశలో ఉన్నాయి. పట్టాలతోపాటు గిరి వికాసం కింద సాగునీటి సౌకర్యం, రుణాలు అందించే అవకాశం ఉంది. ఇందిర సౌర జల పథకం ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు.
– భవానీశంకర్, ఎఫ్డీవో
ఎట్లా బతుకుడు
పునరావాసంలో భాగంగా మాకు అందించిన భూములకు కరెంటు, నీటి సౌకర్యం లేవు. భూములు సాగు యో గ్యంగా లేవు. ఇక్కడికి వచ్చి ఏడాది గడిచినా వ్యవసాయం లేకపోవడంతో కూలీ పనులకు పోతున్నం. పాత గ్రామాల్లో బావులు, విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. అందుకే పరిహారం ఇచ్చి భూములు సాగు యోగ్యంగా చేసే వరకు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటాం.
– కోవ ప్రవీణ్, మైసంపేట్

గిరిజనుల తిరుగుబాటు

గిరిజనుల తిరుగుబాటు