
కడదామా.. వద్దా?
● సందిగ్ధంలో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు ● ప్రకటనకే పరిమితమైన ఉచిత ఇసుక ● అంచనాకు మించిపోతున్న ఖర్చులు ● ముగ్గులు పోసుకునేందుకు నిరాసక్తత
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ఇళ్లు
మంజూరు చేసిన ఇళ్లు 768
మార్కింగ్ పూర్తి చేసినవి 364
బేస్మెంట్ దశలో ఉన్నవి 122
రూఫ్ లెవెల్లో ఉన్నవి 20
మొదటివిడత బిల్లుల చెల్లింపు 79
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి మొగ్గు చూపడంలేదు. చేతిలో సరిపడా డ బ్బులు లేకపోవడం, మెటీరియల్ ధరలు గణనీ యంగా పెరగడం, కూలీ ఖర్చు రెట్టింపు కావడం, నిర్మాణం 400 గజాలకు మించకూడదనే ప్రభుత్వ నిబంధన.. తదితర కారణాలతో చాలామంది ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేరు. యూనిట్ విలువ, క్షేత్రస్థాయిలోని వాస్తవ ఖర్చులకు పొంతన లేక జంకుతున్నారు. కొందరు అప్పు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తుండగా, మరికొందరు ఖర్చుల భయంతో ప్రొసీడింగ్స్ను రద్దు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ముగ్గులు కూడా పోయలేదు.
జిల్లాకు 10,500 ఇళ్లు
జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుకు రూ.5లక్షలను వివిధ దశల్లో చెల్లించేందుకు నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల లబ్ధి దారులకు 1,444 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 1,159 నిర్మాణాలకే అనుమతులు లభించాయి. వీటిలో 364 ఇళ్లకు ముగ్గు పోశారు. 79 మందికి మాత్రమే మొదటిదశ చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని 18మండలాల్లో 15 మోడల్ హౌస్ల నిర్మాణం చేపట్టగా ఐదు బేస్మెంట్, ఐదు స్లాబ్, నాలుగు రూఫ్ దశల్లో ఉన్నాయి.
లబ్ధిదారులపై ధరాభారం
రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.5,500 లేదా స్థానికంగా లభించే ఇసుకకు రూ.3వేలు చెల్లిస్తున్నారు. సిమెంట్, ఇసుక, ఇనుము, ఇటుక ధరలు అమాంతం పెరిగాయి. ఈ భారం భరించలేక కొందరు నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ అదనపు డబ్బులు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు.
దశలవారీగా చెల్లింపులు ఇలా..
బేస్మెంట్ లెవెల్కు రూ.లక్ష
రూఫ్ లెవెల్ విత్ వాల్స్కు రూ.లక్ష
స్లాబ్ లెవెల్కు రూ.2లక్షలు
నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష