
● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్
సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా తక్కువే.. భార్యాభర్తలిద్దరు తమ పిల్లలతో కలిసి సొంత చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకులే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కావడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి సమీపంలోని చిన్న గుడిసెలో ఒకే దగ్గర కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగురు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటన. మరో రెండు ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి.
బాధిత కుటుంబాల్లో విషాదం..
గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూతురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు.
భీంబాయి (ఫైల్)
మాధవ్రావు (ఫైల్)
సునీత (ఫైల్)
రంభాబాయి (ఫైల్)
సుజాత (సంజన) (ఫైల్)
మృతుల వివరాలు
పిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూతురు పెందూర్ మాధవ్రావు (45), పెందూర్ సుజాత అలియాస్ సంజన (16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభాబాయి (40), మంగం భీమ్బాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని (30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత (40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు.

● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్

● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్