
నేరస్తుల గుర్తింపులో కొత్త అడుగు
● పోలీసుల చేతికి ఆధునిక టెక్నాలజీ ● జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్లకు పంపిణీ ● ఈ పరికరంతో నేరగాళ్ల గుర్తింపు సులభం
నిర్మల్టౌన్: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరగాళ్లు అధికారులను ఏమార్చేందుకు ఎత్తుగడలు వేస్తున్న నేపథ్యంలో, పోలీసులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా ‘ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ (అంబిస్)ను అమలు చేస్తున్నారు. గతంలో వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే సేకరించగా, ఇప్పుడు ముఖం, కళ్లు, అరికాళ్ల స్కాన్తోపాటు చేతిరాత, ఒడ్డూ–పొడవు, బరువు, సంతకం వంటి భౌతిక కొలతలను భద్రపరుస్తారు. ఈ వివరాలు నేరగాళ్లను సులభంగా గుర్తించడంలో పోలీసులకు సహాయపడతాయి.
ఏఐ ఆధారిత వ్యవస్థ..
జిల్లాలో తొలిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత అంబిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా నేరగాళ్ల ప్రవర్తన, స్థానాలు, అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేయవచ్చు. ముఠా కార్యకలాపాలను పసిగట్టడంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ఆధారంగా ఈ డేటా సేకరణ చట్టబద్ధంగా జరుగుతుంది.
అంబిస్ పరికరాల వినియోగం..
గతంలో ఆఫీజ్ టెక్నాలజీతో వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకోగా, అంబిస్లో డెల్ ఆప్టిప్లెక్స్ ఆల్–ఇన్–వన్ 7420, ఐరిస్ బిఎం–20 (కళ్ల స్కానర్), ఎప్సన్ వి39 (పాదముద్ర స్కానర్), లాజిటెక్ సి270 వెబ్క్యామ్, హెల్త్ సెన్స్ బిఎస్ 161 (ఎలక్ట్రానిక్ వెయిట్ మెషిన్), పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.
12 పోలీస్ స్టేషన్లకు..
జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్లకు అంబిస్ పరికరాలను ఎస్పీ జానకీ షర్మిల గురువారం అందజేశారు. ఈ పరికరాల వినియోగంపై సందేహాలకు ఫింగర్ ప్రింట్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ కిరణ్ను సంప్రదించాలని సూచించారు.
గుర్తింపు సులభం..
ఈ నూతన అంబిస్ టెక్నాలజీ ఉపయోగించి నేరగాళ్లను చాలా సులభంగా గుర్తిస్తాం. ఈ పరికరంపై పోలీసులు నైపుణ్యత తమ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న వివిధ రకాల నేరాలు, సస్పెక్ట్ చెక్ ఫింగర్ ప్రింట్ సేకరించి కేసుల చేదనకు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ తమ విధులను శ్రద్ధగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో పనిచేయాలి. – జానకీషర్మిల, ఎస్పీ