
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి
● మంత్రి సీతక్క
నిర్మల్చైన్గేట్: మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతతో కూడుకున్న విషయమని, కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, ప్రభుత్వ పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని, అక్టోబర్ 2 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన స్థలాలను కలెక్టర్లు గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిర మహిళా శక్తి భవనాల పనులను నవంబర్లోపు పూర్తిచేయాలన్నారు. అంగన్వాడీలు జూన్ 11న పునఃప్రారంభం కావడంతో చిన్నారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని, ‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. కొత్తగా అంగన్వాడీలు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభరోజునే యూనిఫాం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం యూనిఫాంల స్టిచింగ్ పూర్తయ్యిందన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం అమలుతో జిల్లాలో ఇప్పటి వరకు 1,460 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని పాఠశాలల ప్రారంభంరోజే 48,874 మంది విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పనులు అనంతపేట సమీపంలో వేగంగా సాగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్ల ఏర్పాటు చేసేందుకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఎస్టీ మహిళలు, మారుమూల ప్రాంత మహిళలు స్వయం సహాయక బృందాల్లో తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త సభ్యుల చేర్పు కోసం గ్రామ పంచాయతీస్థాయిలో సమీక్ష జరుపుతున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో పి.రామారావు, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.