
పంట పండింది!
● యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి ● చివరి దశలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ● ఖానాపూర్, సారంగపూర్ మండలాల్లోనే ఇంకా ధాన్యం.. ● ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామంటున్న అధికారులు
లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. 19 మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్ఎస్సీఎస్ల ఆధ్వర్యంలో 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టారు. ఇప్పటి వరకు 41,048 మంది రైతుల నుంచి 1,84,640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 17 మండలాల్లో కొనుగోళ్లు పూర్తికాగా, సారంగాపూర్, ఖానాపూర్ మండలాల్లో మాత్రమే కొనసాగుతున్నాయి. బుధవారంతో ఈ కేంద్రాల్లోనూ కొనుగోళ్లు ముగుస్తాయని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
లక్ష్యాన్ని మించి సేకరణ..
ఈ యాసంగి సీజన్లో 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకో గా, 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించా రు. ఇంకా 360 మెట్రిక్ టన్నుల కొనుగోలు పెండింగ్లో ఉంది. ఇది బుధవారంతో పూర్తవుతుందని అ ధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ ధాన్యం కొనుగోలుచేశామని వెల్లడించారు.
రైతులకు చెల్లింపులు
ఇప్పటివరకు 22,738 మంది రైతులకు రూ.223 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 18,305 మంది రైతులకు చెల్లింపులు త్వరలో పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
తడిసిన ధాన్యం కొనుగోలు
మే నెలలో అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినప్పటికీ, తడిసిన వరిని కూడా కొనుగోలు చేసి రైతులకు ఊరటనిచ్చారు. ఈ సీజన్లో రైతులకు అనుకూలంగా కొనుగోళ్లు సాగినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారీగా ధాన్యం దిగుబడి..
ఈ యాసంగిలో జిల్లాకు నిర్ధేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 1,84,640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 22,738 మంది రైతులకు రూ.223 కోట్లు చెల్లించాం. బుధవారంతో కొనుగోళ్లు పూర్తవుతాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయి.
– సుధాకర్, పౌరసరఫరాల శాఖ డీఎం
యాసంగి ధాన్యం కొనుగోలు లక్ష్యం 1,62,414 మెట్రిక్ టన్నులు

పంట పండింది!