సాక్షి, తాడేపల్లి: ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమరావతి అద్దాలకు రూ.2500 కోట్లు అని ఈనాడులో వచ్చిన వార్త గురించి ప్రస్తావించినా కేసులు, బీఆర్ నాయుడు రాసలీలలు గురించి ప్రశ్నిస్తే కేసులు, కర్నూలు బస్సు దహనం గురించి మాట్లాడినా కేసులే, శాంతిభద్రతల కోసం పని చేయాల్సిన పోలీసులను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అధికారాన్ని ఉపయోగించి రూల్స్కు విరుద్దంగా పని చేస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. కోర్టులు చేయాల్సిన పనులను కూడా పోలీసులే చేస్తారా?. అసభ్యకరమైన పోస్టులు ఉంటే ఆ పోస్టులను తొలగించాలి. కానీ ఏకంగా ఖాతాలనే తొలగించమనే హక్కు ఎవరిచ్చారు?. వైఎస్సార్సీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్ను తొలగించాలని ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రూల్స్కు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?. చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయటం దుర్మార్గం.
‘‘ప్రజా సమస్యలను ప్రశ్నించినా ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. వైఎస్సార్సీపీ ఇన్స్ట్రాగ్రామ్ని పోలీసుల ద్వారా తొలగించారు. 27,443 హింసాత్మక నేరాలు ఏపీలో జరగడం దారుణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా కొరవడ్డాయి. వైఎస్ జగన్ని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. సరైన పరిపాలన చేస్తే ఆ భయం ఉండదు. తాము చేస్తున్న దోపిడీ, అవినీతిలను బయటపెడుతున్నందునే ప్రభుత్వానికి భయం. కేసులు ఎదుర్కోవటం మాకు కొత్త కాదు. కొంతమంది కార్యకర్తలను హత్యలు చేశారు. మా వారిపై దాడులు చేసి, మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులందరి పేర్లూ డిజిటల్ బుక్లో నమోదు చేశాం. వారిపై కచ్చితంగా చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.


