బిజ్నోర్: ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఓ మహిళ పెళ్లిరోజుకు ముందే ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె రాసిన సూసైడ్ నోట్ భర్తకు లభించింది. ‘ఆ వ్యక్తి మీ అమ్మను చాలా హింసించాడు. తనను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించారు’’ అని తెలిపింది. అయితే, వేధింపులకు పాల్పడిన వ్యక్తి పేరును లేఖలో ఆమె పేర్కొనలేదు. ప్రతి జన్మలోనూ మీలాంటి కుటుంబమే రావాలని కోరుకుంటున్నాను. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నన్ను క్షమించు.. అమ్మ చనిపోవాల్సి వస్తోందంటూ ఆమె ఆ నోట్లో రాసింది.
ఆమె మొబైల్ ఫోన్ను పరిశీలించగా, రెండు మూడు అనుమానాస్పద నంబర్ల నుండి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ నంబర్లకు తిరిగి కాల్ చేయగా, ఒక్కరూ కూడా స్పందించలేదు. కానీ ఒక నంబర్ నుండి మాత్రం వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులను బెదిరించారు. బిజ్నోర్ ఎస్పీ అభిషేక్ ఝా మాట్లాడుతూ మహిళ మరణించిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, అనుమానాస్పద నంబర్ నుండి వచ్చిన వీడియో కాల్ను ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.


