
జీపీ సభ్యురాలి భర్త ఆత్మహత్య కేసులో మలుపు
భార్యే సుపారీ ఇచ్చి కడతేర్చింది
నిందితురాలి అరెస్ట్
కర్ణాటక: చెన్నపట్టణ తాలూకా కృష్ణాపురదొడ్డి గ్రామపంచాయతీ సభ్యురాలు చంద్రకళ భర్త లోకేష్ ఆత్మహత్య చేసుకున్న కేసు మలుపు తిరిగింది. భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతనెల 24న లోకేశ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రకళ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వెళ్లి పరిశీలించగా మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఇతనిది ఆత్మహత్యే అని గ్రామస్తులతోపాటు పోలీసులు కూడా నమ్మారు.
డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు చంద్రకళ తన భర్త మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న ఎంకే దొడ్డి పోలీసులు చంద్రకళ ప్రవర్తనపై అనుమానంతో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. చంద్రకళకు యోగేశ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించి బెంగళూరుకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు చంద్రకళ నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. చంద్రకళను అరెస్టు చేసి మిగతా హంతకుల కోసం గాలిస్తున్నారు.