తనిఖీల తర్వాతే ‘అన్నపూర్ణ భండార్’ లబ్ధిదారుల ఎంపిక
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన లక్ష్మీ భండార్ పథకం లబ్ధిదారుల్లో దాదాపు 30 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి చెప్పారు. వారిలో కొందరు భారతీయులు కాదని, అలాగే మరికొందరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగింపునకు గురయ్యాయని తెలిపారు. సువేందు అధికారి బుధవారం ‘అన్నపూర్ణ భండార్’ పథకానికి సంబంధించిన పత్రాన్ని ఆవిష్కరించారు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు.
లక్ష్మీ భండార్ స్కీమ్లో మొత్తం 2.20 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో 30 లక్షల మంది అనర్హులుగా తేలిందన్నారు. అనర్హులను పూర్తిగా ఏరివేసిన తర్వాత అన్నపూర్ణ భండార్లో దాదాపు 2 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే లక్ష్మీ భండార్ స్థానంలో అన్నపూర్ణ భండార్ పథకం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 చొప్పున అందజేస్తారు.


