కోల్కతా: ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా గురువారం ధర్నాకు దిగారు. ఖుదీరాం అనుశీలన్ కేంద్రలోని స్ట్రాంగ్రూంలో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇక్కడ బుధవారం రెండో విడత పోలింగ్ ముగియడం తెల్సిందే.
‘స్ట్రాంగ్ రూం వద్ద బైటాయించిన తమను అధికారులు మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు స్ట్రాంగ్రూంలను తిరిగి తెరుస్తామంటూ ఆ తర్వాత మాకు సమాచారమిచ్చారు’అని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దీంతో, మా కార్యకర్తలంతా వెళ్లిపోయారు. మళ్లీ తెరుస్తామని సమాచారమివ్వడంతో హడావుడిగా తిరిగి వచ్చేశాం. ఇప్పుడేమో మమ్మల్ని రానివ్వడం లేదు. బీజేపీ నేతలకు మాత్రం అనుమతిచ్చారు’అని ఆయన ఆరోపించారు. ‘బ్యాలెట్ పేపర్లను లోపలకు తీసుకెళ్లారు. లైవ్లో ఇదంతా కనిపిస్తూనే ఉంది. అయిన్పటికీ, ఏమీ జరగడం లేదని సీఈవో అంటున్నారు’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
భవానీపూర్ స్ట్రాంగ్రూంలో మమత
తన నియోజకవర్గం(భవానీపూర్) ఈవీఎంలను భద్రపరచిన షకావత్ స్కూల్ వద్దకు సీఎం మమత సాయంత్రానికల్లా చేరుకు న్నారు. అవకతవకలు జరిగే ఆస్కారముందన్న అనుమానంతో తన ఎన్నికల ఏజెంట్తోపాటు స్ట్రాంగ్రూంలోకి వెళ్లి అక్కడే కూర్చున్నారు.


