బెంగాల్‌ పోలింగ్‌: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్‌? | West Bengal 2nd Phase Polling: Tape on EVMs Viral | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ పోలింగ్‌: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్‌?

Apr 29 2026 12:46 PM | Updated on Apr 29 2026 12:59 PM

West Bengal 2nd Phase Polling: Tape on EVMs Viral

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తుది విడత పోలింగ్‌ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..

పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్‌ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.  సౌత్‌ 24 పరగణాలోని పోలింగ్‌ బూత్‌ల్లో.. అదీ  మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.

ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్‌ హార్బర్‌ మోడల్‌ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్‌ బెనర్జీ కూడా ఈ మోడల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్‌ ఇంచార్జి అమిత్‌ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్‌​ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్‌ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్‌ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement