ముంబై-సోలాపూర్ వందే భారత్ రైలు పుణే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 27) రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో స్టేషన్లోకి ప్రవేశించే వేళ నాల్గో బోగీకి చెందిన ఒక ట్రాలీ డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిందని సెంట్రల్ రైల్వే తెలిపింది.
ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ప్రారంభమై మహారాష్ట్రలోని సోలాపూర్ దిశగా వెళ్తోంది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా లేని డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగింది. పుణే స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా దీన్ని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు వారిని మరొక రేక్కి మార్చే ఏర్పాట్లు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారత్లో స్వదేశీగా అభివృద్ధి చేసిన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. 2019లో భారతీయ రైల్వే దీన్ని ప్రారంభించింది. ఇది సంప్రదాయ రైళ్లతో పోలిస్తే వేగంగా, సౌకర్యవంతంగా, సాంకేతికంగా ఆధునికమైనది.


