
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.
కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.