మరో చీలిక వర్గంగా గుర్తించాలని లోక్సభ స్పీకర్ను కోరిన ఎంపీలు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ
ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు ఇవ్వజూపారు
సంజయ్ రౌత్ ఆరోపణ
న్యూఢిల్లీ/ముంబై: సజావుగా సాగుతున్న పార్టీని తిరుగుబాటు ఎంపీలు నిట్టనిలువునా చీల్చే పర్వం పశ్చిమబెంగాల్లో పూర్తయి కొత్తగా మహారాష్ట్రలో మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ సారథి మమతా బెనర్జీకి తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తలనొప్పి తీసుకురాగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్టీలో రెబల్ ఎంపీలు ప్రకంపనలు సృష్టించారు. పార్టీకి లోక్సభలో 9 మంది ఎంపీలుండగా వారిలో కొందరు తిరుగుబాటు లేవదీసినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ఎంపీలు బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తమకు ఆరుగురు ఎంపీల మద్దతు ఉందని, అందుకే ప్రత్యేక వర్గంగా గుర్తిస్తూ లోక్సభలో విడిగా సీటింగ్ కేటాయించాలని స్పీకర్ను వారు కోరినట్లు తెలుస్తోంది.
ఆరుగురు ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్చౌరే, నగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ జాధవ్లు తిరుగుబాటు కూటమిలో ఉన్నట్లు జాతీయమీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీలో మకాం వేసిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ చీలిక ఘట్టానికి తెరవెనుక ఉండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చీలిక మొదలైందన్న వార్తలతో పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే ఎంపీలంతా గురువారం ఢిల్లీలో సమావేశానికి హాజరుకావాలని విప్ జారీచేసింది.
చీలిక వర్గంలో ఆరుగురు ఎంపీలు లేరని పార్టీ నాయకత్వం వాదిస్తోంది. 2006లో రాజ్ ఠాక్రే, 2022లో ఏక్నాథ్ షిండేలు శివసేన పార్టీని చీల్చగా తాజా ఉదంతంతో మూడోసారి పార్టీ ముక్కలుకాబోతోందని వార్తలొచ్చాయి. ఎంపీలు పార్టీ గోడ దూకబోతున్నారనే వార్తలపై ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సమీప కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ‘‘ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు ఆశచూపించి ప్రత్యర్థి పార్టీ లాగేసేందుకు ప్రయత్నిస్తోంది.
పార్టీ మారాలనుకుంటే ముందు రాజీనామా చేయండి. ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులు, కార్యకర్తలు కాళ్లరిగేలా తిరిగి ప్రచారంచేస్తేనే మీరు గెలిచారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించండి. పార్టీ మారాలనే వాళ్లంతా నమ్మకద్రోహులు. ఒకరిద్దరు పార్టీ మారేందుకు రెడీ అయ్యారని మంగళవారం రాత్రే నాకు సమాచారం వచి్చంది. కోట్లరూపాయల నగదు చేతిలో పడితేనే ఢిల్లీ విమానం ఎక్కుతామని వాళ్లు మొండికేశారని తెలుస్తోంది’’ అని రౌత్ వెల్లడించారు.


