ఫైల్ ఫొటో
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు.
కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది.
ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.


