భారత్లో సూడాన్ రాయబారి అబ్దల్లా అలీ హామీ
న్యూఢిల్లీ: సూడాన్ సైన్యం, సూడాన్ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయతి్నస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్లో సూడాన్ రాయబారి మొహమ్మెద్ అబ్దల్లా అలీ ఎల్తోమ్ సోమవారం ఢిల్లీలో మాట్లాడారు.
‘‘పారామిలటరీ అయినా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) వద్ద బందీగా ఉన్న భారతీయుడిని విడిపించి సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రతింపులు జరుపుతున్నాం. గతంలోనూ మా దేశంలోని ఇతర నగరాల్లో భారతీయులు చిక్కుకుపోతే వారిని కాపాడేందుకు భారత విదేశాంగశాఖతో కలిసి పనిచేశాం’’అని ఆయన చెప్పారు. అల్ ఫషీర్ పట్టణంలో ఉంటున్న 36 ఏళ్ల భారతీయుడు ఆదర్శ్ బెహెరాను ఆర్ఎస్ఎఫ్ బలగాలు కిడ్నాప్ చేసి తమకు పట్టున్న న్యాలా నగరానికి తరలించాయి.
ఆదర్శ్ స్వస్థలం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా. ‘‘ప్రస్తుతం సూడాన్లో ఏం జరుగుతుందో ఊహించం అసాధ్యం. అతడిని బలగాలు బాగానే చూసుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలోనే ఆయనను విడుదలచేయగలమని భావిస్తున్నా. సంక్షోభకాలంలోనూ భారత్ మాకు మానవతాసాయం అందించింది. గతంలో వైద్య, ఆహార సామగ్రి అందించి మమ్మల్ని ఆదుకుంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. సూడాన్ త్వరలో పునరుద్దరణ దశకు చేరుకుంటుంది. అప్పుడు పునరుజ్జీవన క్రతువులో భారత్ కీలకపాత్ర పోషిస్తుంది’’అని ఆయన అన్నారు.
ఎందుకీ అంతర్యుద్ధం?
2021 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుతో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ర్ఎస్ఎఫ్తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదన రూపొందించారు. ఇందుకు ఆర్ఎస్ఎఫ్ ససేమిరా అంది. దంతో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో ఇరు వర్గాలు మెషీన్ గన్లు అమర్చిన ట్రక్కులు, సైనికులతో పరస్పర కాల్పులు, దాడులకు తెగబడ్డాయి. దంతో ఆనాటి నుంచి ఇప్పటిదాకా వేలాది మంది చనిపోయారు. కోటి మంది సూడాన్ను వెళ్లిపోయినట్లు ఓ అంచనా.


