నిద్రపోతున్నారా?.. మా ముందుకు రావాల్సిందే! | Stray Dogs Case: No Relief for Chief Secretaries In Supreme Court | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్నారా?.. మా ముందుకు రావాల్సిందే!

Oct 31 2025 1:18 PM | Updated on Oct 31 2025 1:25 PM

Stray Dogs Case: No Relief for Chief Secretaries In Supreme Court

సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల వ్యవహారంలో రాష్ట్రాల తీరుపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు గౌరవమే లేకుండా పోయిందంటూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలో బెంచ్‌ శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో విచారణలో ఊరట కోసం ప్రయత్నించిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు(సీఎస్‌లకు) చుక్కెదురైంది. 

వీధి కుక్కల పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు.. షెల్టర్ల సంగతిని పక్కనపెట్టి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అమలుపై అఫిడవిట్లను వీలైనంత తర్వగా తమకు సమర్పించాలని ఆగష్టులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే రెండు నెలలు గడుస్తున్నా ఏ రాష్ట్రం నుంచి కూడా సరైన స్పందన లేదు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలు హడావిడిగా దీపావళి సమయంలో అఫిడవిట్లు దాఖలు చేయడం అవి రికార్డుల్లోనూ అధికారికంగా నమోదు కాలేదు. 

ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ‘‘దేశం పరువు తీస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. నవంబర్‌ 3వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎస్‌లు తమ ఎదుట హాజరై అఫిడవిట్లు ఎందుకు సమర్పించలేకపోయారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. విచారణలో మినహాయింపు కోరుతూ సీఎస్‌లు కోర్టును అభ్యర్థించారు. వర్చువల్‌గా  హాజరయ్యేందుకు అనుమతించాలంటూ సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇవాళ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలను కోరారు. అయితే.. 

ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని.. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనని.. లేకుంటే చర్యలు తప్పవని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌  హెచ్చరించారు. ఈ క్రమంలో.. తెలంగాణ, ఢిల్లీ, వెస్ట్‌ బెంగాల్‌కు మాత్రమే మినహాయింపు ఉంటుందని పునరుద్ఘాటించారు. 

‘‘ఇది చాలా దురదృష్టకరం. మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలతో కోర్టు సమయం వృథా అవుతోంది. పార్లమెంట్ నిబంధనలు చేస్తుంది, కానీ ఎటువంటి చర్యలు ఉండవు. మేము కంప్లయన్స్ అఫిడవిట్లు ఫైల్ చేయమని ఆదేశిస్తే, వారు దానిని పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలకు గౌరవం లేదు. వాళ్లు భౌతికంగా వచ్చి ఎందుకు కంప్లయన్స్ అఫిడవిట్లు దాఖలు చేయలేదో చెప్పాలి’’ అంటూ సోలిసిటర్‌ జనరల్‌ విజ్ఞప్తిని బెంచ్‌ తోసిపుచ్చింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎస్‌ మినహాయింపు కోరగా.. అందుకు సైతం కోర్టు ఒప్పుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement