ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు పునారావాసం కల్పించడానికి సరైన ఏర్పాట్లు చేసిందని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. "పునారావాసం - పునరుజ్జీవనం" కార్యక్రమం ద్యారా మావోయిస్టులకు నూతన జీవితం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజాపూర్లో మంగళవారం 34మంది నక్సల్స్ లొంగిపోయారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ప్రెస్నోట్ విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారిపై రివార్డు రూ. 84 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికి పునరావాసం పునరుజ్జీవనం కార్యక్రమం ద్వారా నూతన జీవితం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
బీజాపూర్ జిల్లాలో జనవరి1, 2024 నుంచి మెుత్తం 824 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోగా 1079 మంది అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. 220 మంది నక్సల్స్ ఎన్కౌంటర్లలో మరణించినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి కొత్తజీవితం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు పిలుపునిచ్చారు.
అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. కేంద్ర బలగాల ఎన్కౌంటర్లలో ఆ పార్టీ సభ్యులు పెద్దసంఖ్యలో మృతిచెందారు. దానితో పాటు అధిక సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


