గుజరాత్‌లో వరుణ విలయం

South Gujarat receives heavy rains - Sakshi

అహ్మదాబాద్‌: దక్షిణ గుజరాత్‌లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్‌ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్‌ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది.

వల్సాద్‌ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్‌దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్‌నగర్‌లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్‌లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.  

ముంబైలో కొంత ఊరట  
నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్‌ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు అలెర్ట్‌ చేశారు. థానె జిల్లా మిరాభయందర్‌ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్‌ సిబ్బంది రక్షించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు తెలంగాణ, రాజసాŠత్‌న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top