సాక్షి, చెన్నై: తనకు ఎలాంటి మంత్రి పదవీ వద్దు... తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని లక్ష్య జననాయగ కట్చి వ్యవస్థాపకుడు, కామరాజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోస్ చార్లెస్ మార్టిన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. మంత్రుల నియమకం, శాఖల కేటాయింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆయన ఆదివారం మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ. 100 కోట్ల బేరసారాల వివాదం
ఈ సందర్భంగా జోస్ చార్లెస్ మార్టిన్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం వెనుక తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తనకూ మంత్రి పదవి ఇవ్వాలని, దానికోసం దాదాపు రూ. 100 కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నాయని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. “నా వల్ల లేదా నా మద్దతుదారుల వలన మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందని భావిస్తే.. నన్ను పక్కన పెట్టేయండి. నాకు ఏ పదవీ అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా కామరాజ్ నగర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ (ఆదర్శ) నియోజకవర్గంగా మార్చడమే నా ఏకైక లక్ష్యం’ అని స్పష్టంచేశారు.
వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్కు వినతిపత్రం కూడా సమర్పించానని తెలిపారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం (టీవీకే సంకీర్ణ ప్రభుత్వం) బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రులను నియమించి, పనులను పరుగులు పెట్టిస్తోందని ఆయన గుర్తుచేశారు. అక్కడ కనీస అనుభవం లేని వారు కూడా తమ శాఖల్లో చురుగ్గా పనిచేస్తుంటే.. పుదుచ్చేరిలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు ఉండి కూడా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు.


