ఓఎస్ఎం వివాదంలో విద్యార్థులకు రాహుల్ బాసట
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆదివారం ఆయన షేర్ చేశారు. ‘వీరంతా సీబీఎస్ఈలో అవకతవకలపై మోదీ ప్రభుత్వాన్ని చాలా చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగారు. ప్రశ్నిస్తే వీళ్లను అవమానిస్తున్నారు. సమాధానాలకు బదులు వీళ్లకు అవమానాలే ఎదురయ్యాయి.
దేశ వ్యతిరేకులంటూ వారిపై ముద్ర వేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ దేశద్రోహులతో ఎంతో ఆసక్తికర సంభాషణ జరగింది. వీరికి ఎంతో చక్కటి భవిష్యత్తుంది’ అని అన్నారు. ఇటీవల సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన 12వ తరగతి ఆన్సర్ షీట్ తమది కాదంటూ వేదాంత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. అనంతరం మరికొందరు విద్యార్థులూ తమకూ ఇతరుల ప్రశ్నపత్రాలు ఇచ్చారంటూ ఆన్లైన్లో ప్రకటించడం తీవ్ర కలకలం రేగిన విషయం తెల్సిందే.


