న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులతోపాటు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్లో ప్రధాని మోదీ..‘తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు సి.జోసెఫ్కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కలిసి ముందుకు సాగుదాం’అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్తో ఫోన్లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ‘టీవీకే చీఫ్ విజయ్కు అభినందనలు. తమిళనాడు కొత్త తరాన్ని, కొత్త గళాన్ని ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ఆదివారం విజయ్కు అభినందనలు తెలిపారు.
శ్రీలంక, తమిళనాడు నడుమ బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న విషయాన్ని ఆయన ఎక్స్లో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విజయ్ను అభినందించారు. ‘టీవీకే అధినేత నాయకత్వంలో రాష్ట్ర రాజకీయ, సామాజికంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్,, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్లతోపాటు సినీనటులు కమల్ హాసన్, ఆర్.మాధవన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్ టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్కు అభినందనలు తెలిపారు.


