ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తున్నారు.
యుద్ధం నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన తరహాలో ఇరాన్ యుద్ధ ప్రభావాన్ని కూడా అధిగమించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత్పై దీర్ఘకాలికంగా ప్రభావం చూపవచ్చని ప్రధాన మంత్రి మోదీ ఇటీవలే చెప్పారు. అత్యవసర వస్తువుల సరఫరా ఎక్కడా ఆగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో చూపిన ‘టీమ్ ఇండియా’ భావనను గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తి ఇప్పుడు దేశాన్ని నడిపించాలని వ్యాఖ్యానించారు.
PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro
— ANI (@ANI) March 27, 2026


