న్యూఢిల్లీ: సాధారణ ప్రజలపై మందుల ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)తాజాగా 30 రకాల ఔషధాల గరిష్ట చిల్లర ధరలను (Retail Prices) ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013 నిబంధనల మేరకు, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, అలర్జీలు, విటమిన్ లోపాల చికిత్సలో వాడే మందులను ఈ ధరల నియంత్రణ జాబితాలో చేర్చారు.
అందుబాటులోకి రానున్న ముఖ్యమైన మందులు
కొత్తగా ధరలు ఖరారు చేసిన వాటిలో గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం వాడే అటోర్వాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ మాత్రలు ఒక్కొక్కటి రూ. 18.46కు లభిస్తాయి. అలర్జీల కోసం వాడే బిలాస్టిన్, మోంటెలుకాస్ట్ మాత్ర ధర రూ. 21.22గా నిర్ణయించారు. అలాగే హైపర్ టెన్షన్ రోగుల కోసం బిసోప్రోలోల్ ఫ్యూమరేట్, అమ్లోడిపైన్ మాత్ర రూ. 9.40కు అందుబాటులో ఉంటాయి. ఇక డయాబెటిస్ బాధితుల కోసం ఎంపగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్ వంటి కీలక కాంబినేషన్ మాత్రల ధరను రూ. 11.91 నుండి రూ. 14.88 లోపుగా నిర్ణయించారు.
అవయవ మార్పిడి రోగులకు ఊరట
కేవలం సాధారణ వ్యాధులే కాకుండా, అత్యవసర చికిత్సలో వాడే మందులను కూడా ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ముఖ్యంగా అవయవ మార్పిడి (Organ Transplant) చేయించుకున్న రోగులు వాడే ‘టాక్రోలిమస్ ప్రోలాంగ్డ్ రిలీజ్’ క్యాప్సూల్ (3 mg) ధరను రూ. 127గా నిర్దేశించారు. ఇవే కాకుండా, ఎముకల వ్యాధి, పోషకాహార లోపాల నివారణకు వాడే విటమిన్ డి3 ఓరల్ సొల్యూషన్స్ వంటి వాటికి కూడా కొత్త ధరలను అమల్లోకి తెచ్చారు.
అదనపు ధర వసూలు చేస్తే కఠిన చర్యలు
తయారీదారులు నిర్ణీత ధరల ప్రకారం ప్యాక్ ధరలను లెక్కించి, వాటిని ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IPDMS)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దుకాణదారులు సవరించిన ధరల జాబితాను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఎన్పిపిఎ ఆదేశించింది. ఒకవేళ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 నిబంధనల ప్రకారం అదనపు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


