చైనీస్ భాష మనకొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో షాక్ ఇచ్చింది. కొత్తగా ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020లో (ఎన్ఈపీ) చైనా భాషకు చోటు దక్కలేదు. సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు.
గత ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది.