లక్నో: అసలే కోతులు.. ఆపై విమానాశ్రయ రన్వేపైకి వచ్చాయి. ఇంకేముంది విమానం టేకాఫ్ రద్దయ్యింది, ఈ ఘటన లక్నో విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో రాయ్పూర్కు వెళ్తున్న ఇండిగో విమానం సుమారు 150 మంది ప్రయాణికులతో టేకాఫ్కు సిద్ధమైంది. రన్వే మీద కొంత దూరం కూడా వెళ్లింది. ఇంతలో రన్వేపైకి కోతులు వచ్చాయి. అది గమనించిన పైలట్లు వెంటనే టేకాఫ్ను రద్దు చేసి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి రప్పించిన ఏటీసీ, ఇంధనం నింపుకొన్న తర్వాత సుమారు గంట ఆలస్యంగా క్లియరెన్స్ ఇచ్చింది.
ఇండిగో విమానం ఆలస్యం మరికొన్ని విమానాల షెడ్యూల్పై ప్రభావం చూపింది. ఈ ఘటనకు కొద్ది ముందే, రన్వే సమీపంలో కోతులు ఉన్నాయని విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకటి అధికారులను అప్రమత్తం చేసిందని, దీంతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం టేకాఫ్ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందిని అధికారులు తెలిపారు. విమానాశ్రయం ఉన్న అమౌసి సమీపంలో ఉన్న రహీమాబాద్ గ్రామంలోని పండ్ల తోటల నుంచి కోతులు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు. కోతుల వల్ల విమానాలకు అంతరాయం కలిగిన ఘటనలు చాలా అరుదు.


