మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి | Minister Zameer Ahmed Khan Sensational comments On Pakistan | Sakshi
Sakshi News home page

మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి

May 3 2025 9:26 AM | Updated on May 3 2025 12:59 PM

Minister Zameer Ahmed Khan Sensational comments On Pakistan

బెంగళూరు: పహ‍ల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు బీజడ్‌ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్‌ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్‌ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్‌–30, ఎంకేఐ, మిరాజ్‌–2000, మిగ్‌–29, జాగ్వార్, సీ–130జే సూపర్‌ హెర్క్యులస్, ఏఎన్‌–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.

పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వేలో జలాలాబాద్‌ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్‌ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్‌జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్‌–2 ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్‌ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్‌ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement