న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. స్కైమెట్ అధికారిక అంచనాను విడుదల చేసి వివరాలు తెలిపింది. గత అనేక సంవత్సరాల సగటు వర్షపాతాన్ని (దీర్ఘకాల సగటు వర్షపాతం)ఎల్పీఏ అంటారు. ఇది సాధారణంగా 868.6 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ సారి అందులో సుమారు 94 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. దీనికి 5 శాతం ఎక్కువ లేదా తక్కువగానూ వర్షాలు పడవచ్చని చెప్పింది.
స్కైమెట్ అంచనాలో ముఖ్యాంశాలు
మొత్తం వర్షపాతం: ఎల్పీఏలో 90-95%గా ఉండనుంది, అంటే సగటుతో పోలిస్తే తక్కువ వర్షాలు పడతాయి.
ఈఎన్ఎస్ఓ ప్రభావం (ఈఎన్ఎస్ఓ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపే వ్యవస్థ): దీర్ఘకాల లా నినా తర్వాత పసిఫిక్ సముద్రం ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ దశకు మారింది. వర్షాకాలం సమయంలో ఎల్ నినో బలపడుతుంది. ఇది ముఖ్యంగా జులై-సెప్టెంబర్లో వర్షాలు తక్కువ పడేలా చేసే అవకాశం ఉంది.
భారత మహాసముద్ర ద్విధ్రువం (ఐఓడీ): న్యూట్రల్ లేదా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. జూన్లో వర్షాలు బాగా పడడానికి సాయం చేస్తుంది. కానీ, ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదు.
ప్రాంతాల వారీగా
మధ్య, వాయవ్య భారత్ (పంజాబ్, హరియాణా, రాజస్థాన్) ప్రాంతాల్లో ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు.
తూర్పు, ఈశాన్య భారత్లో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది.
నెలవారీగా అంచనా
జూన్: ఎల్పీఏలో సుమారు 101% (మంచి ప్రారంభం)
జూలై: సుమారు 95%
ఆగస్టు: సుమారు 92%
సెప్టెంబర్: సుమారు 89% (అత్యల్ప వర్షాలు)
ఇలా జరిగే అవకాశాలూ ఉన్నాయ్..
అధిక వర్షపాతం (>110% ఎల్పీఏ) అవకాశం 0% (అంటే ఈ సారి అధిక వర్షపాతం పడే ఛాన్స్ లేదు)
సాధారణం కంటే ఎక్కువ 10%
సాధారణం 20%
సాధారణం కంటే తక్కువ 40%
వర్షాభావం (<90% ఎల్పీఏ) 30%
తక్కువ వర్షపాత ప్రభావాలు
మధ్య, పశ్చిమ భారత వర్షాధార ప్రాంతాల్లో రైతులు నీటి కొరతను ఎదుర్కోవచ్చు.
ప్రభుత్వ అధికారులు తూర్పు, ఈశాన్యంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, వాయవ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసుకోవాలి.
సీజన్ రెండో భాగంలో అస్థిరంగా పడే వర్షాలు పంటల దిగుబడి, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


