'The Kerala Story' Row: SC Issues Notices To West Bengal, Tamil Nadu Over Ban On Film - Sakshi
Sakshi News home page

ది కేరళ స్టోరీ.. బెంగాల్‌, తమిళనాడుకు సుప్రీం నోటీసులు

May 12 2023 3:46 PM | Updated on May 12 2023 4:15 PM

The Kerala Story Row Supreme Court Issues Notices To Bengal And Tamil Nadu - Sakshi

ఢిల్లీ: ది కేరళ స్టోరీ.. ఈ సినిమాపై వివాదం కొనసాగుతున్నది. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్‌ ఎందుకు చేశారని దేశ అ‍త్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బెంగాల్‌, తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.

అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది కదా? బెంగాల్‌ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి? అని ప్రశ్నించింది. బ్యాన్‌కు గల కారణాలను చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు ది కేరళ స్టోరీ బ్యాన్‌లో ఉన్న బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్‌ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో, తమిళనాడులో ఈ సినిమా విడుదల కాలేదు. 

ఇదిలా ఉండగా.. 'ది కేరళ స్టోరీ'ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ సినిమాను బ్యాన్‌ చేసిన సందర్బంగా బెంగాల్‌ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు  హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్‌ అయ్యారు. 

మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని మేకర్స్ స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది..
వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్‌ ఫైట్‌.. కౌన్‌బనేగా కన్నడ సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement