మైసూర్: కర్ణాటకలో విషాదం జరిగింది. 43 ఏళ్ల ఐటీ నిపుణుడు మృతిచెందారు. వ్యవసాయ పనుల్లో ఉండగా.. పిడుగు పడి టెక్కీ రోషన్ బాలకృష్ణ మరణించారు. మడికేరి పట్టణానికి చెందిన రోషన్.. కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇటీవలే వ్యవసాయం మీద ఆసక్తితో తన ఐటీ జాబ్ను వదిలేసి.. ఒక స్నేహితుడితో కలిసి సాగు బాట పట్టారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను విక్రయించే (మార్కెటింగ్) వ్యాపారంలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇంటి నుంచే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
రోషన్ తన వ్యవసాయ ప్రణాళికల్లో భాగంగా ఒక భూమిని పరిశీలించడానికి మైసూర్కు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు భార్య, కుమారుడు కూడా ఉన్నారు. ఆ పొలం సమీపంలో రోషన్.. ఒక మామిడి చెట్టు దగ్గర కాయలు కోయడానికి ఆగిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
రోషన్ బాలకృష్ణ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తంలో రూ.4 లక్షలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.1 లక్షను జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి విడుదల చేయనున్నారు.


