4 ఏళ్లలో 25 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం!
వియత్నాం అధ్యక్షుడితో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం.
ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు.
మా ద్రాక్ష రుచి చూస్తారు..
‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు.


