ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా పడింది.
కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్తో భారత్ చేరుకుంది.
అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్తో పాటు సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము.


