
భవనం కూలి ఒకరు మృతి
శిథిలాల కింద చిక్కిన మరో ఏడుగురు!
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని బాబుసాబ్ పాళ్యలో నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కట్టడం మంగళవారం సాయంత్రం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు పది మందిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింద మరో ఏడుగురి వరకు చిక్కుకుని ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన సమయంలో భవనంలో 18 మంది వరకు కూలీలున్నట్లు తెలిసింది.
జల దిగ్బంధంలో అపార్ట్మెంట్లు
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం యలహంకలోని కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి చెరువు నీరు పోటెత్తింది. దీంతో అపార్ట్మెంట్లోని 2 వేల మంది చిక్కుబడి పోయారు. 650 కుటుంబాలకు గాను 250 కుటుంబాలను బయటకు తరలించారు.