కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు.
ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు.


