గల్వాన్‌ గాయానికి ఐదేళ్లు.. కల్నల్‌ సంతోష్‌ సహా 20 మంది వీరమరణం | Galwan Valley Issue 5 years since how India has fortified border | Sakshi
Sakshi News home page

గల్వాన్‌ గాయానికి ఐదేళ్లు.. కల్నల్‌ సంతోష్‌ సహా 20 మంది వీరమరణం

Jun 16 2025 7:35 AM | Updated on Jun 16 2025 9:42 AM

Galwan Valley Issue 5 years since how India has fortified border

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: గల్వాన్‌ లోయ ఘర్షణ. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు చేసిన సాయుధ దాడి. మూడు వందలకు పైగా సైనికులు దొంగ దెబ్బ తీసినా.. భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు. ఈ వీరోచిత పోరాటంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కో ల్పోయారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ గల్వాన్‌ ఘర్షణ జరిగి జూన్‌ 15తో ఐదేళ్లయింది. ఇది భారత్, చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి మన సరిహద్దు రక్షణ, వ్యూహాల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సరిహద్దులో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే కాదు.. సైనిక సంసిద్ధతను కూడా భారత్‌ పెంచింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాస్త మెరుగుపడ్డాయి.

ఐదేళ్లలో అభివృద్ధి 
గల్వాన్‌ ఘటన తరువాత మన ఆర్మీ వాస్తవా«దీన రేఖ వెంబడి, ప్రత్యేకించి తూర్పు లడఖ్‌లో సాయుధ దళాలను అధిక మొత్తంలో పెంచింది. అలాగే.. యుద్ధ పరికరాలను కూడా మహరించింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. గల్వాన్‌ సంఘటన  ముఖ్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ జరిగింది. కేంద్రం 2024లోనే రూ.2,236 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే కంటే 9.53% ఎక్కువ. ఇందులో రూ.7,146 కోట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ)కు  కేటాయించారు.

వీటితో లడఖ్, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మించారు. వీటిలో ఉమ్లింగ్‌ లా (19,024 అడుగులు) వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి నిర్మాణంతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న  న్యోమా ఎయిర్‌ఫీల్డ్, షింకు లా మధ్య సొరంగం కూడా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి డిజిటల్‌ ల్యాండ్‌స్కేప్‌ కూడా మారిపోయింది. భారత సైన్యం, భారతీ ఎయిర్‌టెల్‌ సంయుక్తంగా గల్వాన్, డెమ్‌చోక్‌తో సహా లడఖ్‌లోని మారుమూల గ్రామాలను 4జీ నెట్‌వర్క్‌ను అనుసంధానించారు. ఇది టెలిమెడిసిన్, డిజిటల్‌ విద్య, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి తోడ్పడింది. అంతేకాదు.. దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది, స్థానికుల జీవనోపాధిని మెరుగుపడింది.

దౌత్యంలో పురోగతి...  
దౌత్య పరంగానూ ఇరు దేశాలు పురోగతిని సాధించాయి. 2020 నుంచి ఇప్పటివరకూ వివిధ స్థాయిల్లో 30 దశలకు పైగా చర్చలు జరిగాయి. అనేక ఘర్షణ పాయింట్ల నుంచి సైనాన్ని ఉపసంహరించుకున్నారు. జూలై 2020లో గల్వాన్, ఫిబ్రవరి 2021లో పాంగోంగ్‌ త్సో, ఆగస్టు 2021లో పీపీ17ఏ (గోగ్రా–హాట్‌ స్ప్రింగ్స్‌), సెపె్టంబర్‌ 2022లో పీపీ15, అక్టోబర్‌ 2024లో డెమ్‌చోక్, డెప్సాంగ్‌లలో చైనా తమ శిబిరాలను తొలగించింది. వీటితోపాటు అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు జరిగాయి. ఈ ఫలితంగా మానస సరోవర్‌ యాత్ర పునఃప్రారంభమైంది.

ఇక ఈనెల 12న భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి సన్‌ వీడాంగ్‌తో విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా చర్చించారు. వీసాను సులభతరం చేయడంతోపాటు మీడియా మార్పిడి, 75 సంవత్సరాల భారతదేశం–చైనా దౌత్య సంబంధాల స్మారక వేడుకలపైనా చర్చించారు. అయితే... ఆయా ప్రాంతాల నుంచి సైన్యాన్ని పాక్షికంగా ఉపసంహరించి నప్పటికీ భారత్‌ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘా కొనసాగిస్తోంది. 
    
ఆరోజు ఏం జరిగింది?..
భారత్‌–చైనా సరిహద్దులోని గల్వాన్‌ నది కీలకమైన ప్రాంతం. ఇక్కడ చైనా బలగాలు వాస్తవా«దీన రేఖను దాటి ముందుకొచ్చాయి. వారిని మన జవాన్లు అడ్డుకోవడంతో పలుమార్లు ఘర్షణ జరిగింది. పరిస్థితి తీవ్రమవ్వడంతో సమావేశమైన ఇరు దేశాల ఆర్మీ అధికారులు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. గల్వాన్‌లోని భారత భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్‌ రెజిమెంట్‌ కమాండింగ్‌ అధికారి, తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్‌ బృందం వాటిని నేలమట్టం చేసింది. దాంతో చైనా సైనికులు మన జవాన్లపై దాడికి దిగారు. వంద మంది కూడా లేని భారత జవాన్లపై 300 మందికి పైగా చైనా సైనికులు దాడికి తెగబడ్డారు. 

అయినా ఈ దొంగ దెబ్బను మనవాళ్లు తెగువతో ఎదుర్కొన్నారు. జూన్‌15న సాయంత్రం మొదలైన మారణకాండ అర్ధరాత్రి దాకా సాగింది. అక్కడ ఆయుధాలు వాడకూడదన్న ప్రోటోకాల్‌ను మన సైనికులు పాటించగా చైనా ముష్కరులు మాత్రం ముందే ఏర్పాటు చేసుకున్న ఇనుప రాడ్లతో దాడికి దిగారు. గాయపడ్డ మన సైనికులను గల్వాన్‌ నదిలో తోసేశారు. ఈ క్రమంలో కమాండింగ్‌ అధికారి కల్నల్‌ సంతోష్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా యుద్ధమైదానం వీడలేదు. తోటి జవాన్లను వెన్నంటి నడిపించారు. ఈ ఘర్షణలో ఆయనతో పాటు 20 మంది జవాన్లు ప్రాణాలరి్పంచారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఆ సంఖ్యను అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు. 41 మంది గాయపడ్డారని ప్రకటించింది. చైనా 41 మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా, ఆ్రస్టేలియా పరిశోధన తేల్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement