తొలి దఫాలో 2,000 తేలికపాటి మెషీన్ గన్లు అందజేత
గ్వాలియర్: రక్షణరంగ ప్రైవేట్ సంస్థ ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’తయారుచేసిన తేలికపాటి మెషీన్ గన్(ఎల్ఎంజీ) ‘ప్రహార్’తొలిసారిగా భారత సైన్యం చేతికొచ్చింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఈ గన్లను తయారుచేశారు. గ్వాలియర్లోని ఆయుధ కర్మాగారంలో తొలి దఫాలో తయారుచేసిన 2,000 మెషీన్ గన్లను ఆర్మీకి అందజేశారు. శనివారం గ్వాలియర్లో జరిగిన ఈ ఆయుధాల బదిలీ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయుధాల సమీకరణ విభాగ డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు, అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
7.62 ఎంఎం కాలిబర్(బుల్లెట్) సామర్థ్యంతో ఈ తేలికపాటి మెషీన్గన్లను తయారుచేశారు. దీని బ్యారెల్ పొడవు 508 మిల్లీమీటర్లు. బరువు 8 కేజీలు. గన్ మొత్తం పొడవు 1.1 మీటర్. ‘‘గరిష్టంగా ఒక కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గురిపెట్టి కాల్చవచ్చు. ఈ గన్ల తయారీకి బిడ్డింగ్, అమనుతులు, ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా మొత్తంగా ఆరేళ్ల ప్రయాణం పూర్తయింది. గడువు కన్నా 11 నెలల ముందుగానే తొలి బ్యాచ్ గన్లను తయారుచేసి ఇస్తున్నాం. మొత్తంగా 40,000 గన్లను షెడ్యూల్లోపు ఇచ్చేస్తాం’’అని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ చెప్పారు.


