కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు సహా ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శి, మరికొందరు అధికారులను బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మార్పులు చేశామని తెలిపింది.
ఎవరెవరిని బదిలీ చేశారు?
మమతా బెనర్జీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇద్దరు ఉన్నత అధికారులను ఎన్నికల కమిషన్ తొలగించింది.
చీఫ్ సెక్రటరీ: నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది.
ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్: జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.
ఇతర కీలక నియామకాలు
డీజీ అండ్ ఐజీపీ: సిద్ధ్ నాథ్ గుప్తా (ఐపీఎస్-1992)
డీజీ, కరెక్షనల్ సర్వీసెస్: నటరాజ్ రమేశ్ బాబు (ఐపీఎస్-1991)
ఏడీజీ అండ్ ఐజీపీ, లా అండ్ ఆర్డర్: అజయ్ ముకంద్ రనడే (ఐపీఎస్-1995)
కొలకతా పోలీస్ కమిషనర్: అజయ్ కుమార్ నంద్ (ఐపీఎస్-1996)
ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. బదిలీ అయిన అధికారులను ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల పనుల్లో నియమించరు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మార్పులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్నికల కమిషన్పై విమర్శలు చేశారు. అర్ధరాత్రి దాటాక బెంగాల్ హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం సరికాదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నత అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఘటన 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది..
మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి బదిలీలు చేయడానికి కమిషన్కు రాజ్యాంగ అధికారము ఉందని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన తృణమూల్ కాంగ్రెస్ను విమర్శించారు.


