K Kavitha: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే..! | ED Serves Notices To Kalvakuntla Kavitha On CBI FIR | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌ హీట్‌: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే..! పిళ్లై రిమాండ్‌ రిపోర్టులో సంచలనాలు

Mar 8 2023 12:32 PM | Updated on Mar 8 2023 1:04 PM

ED Serves Notices To Kalvakuntla Kavitha On CBI FIR - Sakshi

సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ దూకుడు.. 

సాక్షి, ఢిల్లీ:  లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. అందుకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుంది. ఈ మేరకు కిందటి ఏడాది ఆగష్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆ ఎఫ్‌ఐఆర్‌ను బేస్‌ చేసుకుని ఈసీఐఆర్‌(Enforcement Case Information Report) నమోదు చేసింది.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్లు.. 477A, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 7 ప్రకారం.. కవితకు నోటీసులు జారీ చేసినట్లు ఉంది. గతంలో కవితను.. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి మరీ సీబీఐ గతేడాది డిసెంబర్‌లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎఫ్‌ఐఆర్‌కు తోడు ఇప్పుడు పిళ్లై స్టేట్‌మెంట్‌ కూడా ఈడీ దర్యాప్తులో కీలకంగా మారినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు..

లిక్కర్‌ స్కామ్‌లో అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలను పేర్కొంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. నేరుగానే.. అరుణ్ రామచంద్ర పిళ్లైను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బినామీగా పేర్కొంది.

కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్ గ్రూప్‌లోలో రామచంద్ర పిళ్లై ఉన్నట్లు పేర్కొంది ఈడీ. ఇంకా రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముందంటే.. ‘లిక్కర్ బిజినెస్‌లో 12 శాతం లాభం ఉండేలా పాలసీని రూపొందించారు. అందులో 6 శాతం ముడుపులు ఆప్ కి ముట్ట చెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఇండో స్పిర్ట్,బ్రిండ్ కో,మహదేవ్ లిక్కర్స్.. ఏటా రూ. 3వేల 500 కోట్ల బిజినెస్ ఈ మూడు సంస్థల్లో నడుస్తోంది. వీటికి 12శాతం లాభం కింద.. ఏడాదికి 400 కోట్లు లాభం ఆర్జించాయి. అందులో 210 కోట్లు  ఆప్ కి వెళ్లాల్సి ఉంది. ఇక..  పిళ్ళై టీమ్ రూ. 296.2 కోట్ల నేరపూరితంగా లాభాలు ఆర్జించారు. వచ్చిన డబ్బులతో ఆస్తులు కొన్నారు. కల్వకుంట్ల కవిత ప్రయోజనాల కోసం ఆయన పని చేశారు’’ అని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement