సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్, లడాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రమాణ స్వీకారం చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 37కు చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను చీఫ్ జస్టిస్తో కలిపి 34 నుంచి 38కి పెంచిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న రెండు ఖాళీలను కలుపుకుంటే మొత్తం ఆరుగురు న్యాయమూర్తుల నియామకాలు జరగాల్సి ఉండింది. సుప్రీంకోర్టు కొలీజియం మే నెల 27న ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయడంతో కేంద్రం వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒకే ఒక్క న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉన్నట్లు అయ్యింది.
బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు...
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సోమవారం నియమితులైన సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన (59) ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రెండో మహిళా న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన కావడం విశేషం. 2018లో జస్టిస్ ఇందిరా మల్హోత్ర ఇలాగే నేరుగా సుప్రీంకోర్టుకు ఎంపికయ్యారు. 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయ విద్యలో పట్టభద్రురాలైన మోహన ఇప్పటివరకూ ఆ నగరంలోనే వృత్తిలో కొనసాగుతున్నారు. అంతేకాదు... మోహన ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన 12వ వ్యక్తి. మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ బి.వి.నాగరత్న మాత్రమే ఉండగా.. తాజా నియామకంతో ఈ సంఖ్య రెండుకు చేరనుంది.


