ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేగింది. ఓ మాస్క్ ధరించిన అగంతకుడు తన కారుతో అసెంబ్లీ వీఐపీ ఇనుప గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకెళ్లాడు. స్పీకర్ రూమ్ ఎదురు బొకే ఉంచి.. స్పీకర్ కారుపై ఇంకు చల్లాడు. అనంతరం తన కారుతో పరారయ్యాడు.
పోలీసులు సమాచారం మేరకు.. ముసుగు ధరించిన వ్యక్తి కారులో వచ్చి గేట్ నంబర్ 2 వద్ద ఇనుప గేటును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. డ్రైవర్ అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లాడు. ఆపై స్పీకర్ ఛాంబర్ ఎదుట బూకే ఉంచడం, ఆయన కారుపై ఇంక్ చల్లడం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడం అంతా సినిఫక్కీలో జరిగినట్లు అసెంబ్లీ అధికారులు తెలిపారు.
అంగతకుండి తీరుపై అనుమానంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మాస్క్ మ్యాన్ ఉంచిన పూల బుకేలో పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని పరిశీలించింది. అందులో ఎలాంటి పేలుడు, అనుమానాస్పద వస్తువులు లేదని నిర్ధారించింది.
అసెంబ్లీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. మాస్క్ మ్యాన్ కారు ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


