మటన్‌ అడిగితే బీఫ్‌ పెడతారు | Bengaluru restaurant sealed for allegedly selling beef as mutton | Sakshi
Sakshi News home page

మటన్‌ అడిగితే బీఫ్‌ పెడతారు

Jun 1 2026 7:34 AM | Updated on Jun 1 2026 7:34 AM

Bengaluru restaurant sealed for allegedly selling beef as mutton

    బెంగళూరులో ఓ రెస్టారెంటు నిర్వాకం  

    పోలీసుల ఆపరేషన్‌లో బట్టబయలు  

    రెస్టారెంటు సీజ్, యజమానుల అరెస్టు

బెంగళూరు: మటన్‌ బిర్యానీ తిందామని ఆశగా వెళ్లిన కస్టమర్లకు బీఫ్‌ బిర్యానీ పెడుతున్నారు. దీంతో కొందరు కస్టమర్లు గుర్తించి గొడవకు దిగడంతో పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది. బెంగళూరులో బొమ్మనహళ్ళిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరతిలో నివసించే కేరళీయులు జిజు అలెగ్జాండర్,  కెబి షిబు, బొమ్మనహళ్లిలోని ఇసిరి హబ్‌ కాయలోరం ఫ్యామిలీ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్‌లో మటన్‌ వంటకాలను ఆర్డర్‌ చేస్తే బీఫ్‌ను వడ్డిస్తున్నారని కొందరు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. రెస్టారెంట్‌ మెనూ కార్డులో ఎక్కడా బీఫ్‌ గురించి ప్రస్తావించ లేదు. తాము మటన్‌ వంటకాలు ఆర్డర్‌ చేస్తే, బీఫ్‌ పెట్టారని, దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడ్డామని చాలామంది ఫిర్యాదు చేశారు.  

పోలీసుకూ బీఫ్‌ వంటకం  
ఈ నేపథ్యంలో పోలీసులు రహస్య ఆపరేషన్‌ను నిర్వహించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి హోటల్‌కు వచ్చాడు. మటన్‌ బిర్యానీ కావాలని చెప్పగా తెచ్చిచ్చారు. కానీ అందులో ఉన్నది బీఫ్‌ ముక్కలు  అని నిర్ధారణ అయింది. నిందితులు జిజు, షిబులపై కర్ణాటక గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి సెంట్రల్‌ జైలుకు పంపారు. మరో నిందితుడు అభిలాష్‌ పరారీలో ఉన్నాడు. రెస్టారెంటును సీజ్‌ చేశారు. తాము ఇంతకాలం తిన్నది బీఫా అని కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement