శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర | Azadi Ka Amrit Mahotsav: Vision 2047 Aim For Development In All Aspects | Sakshi
Sakshi News home page

శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర

Aug 8 2022 1:29 PM | Updated on Aug 8 2022 1:41 PM

Azadi Ka Amrit Mahotsav: Vision 2047 Aim For Development In All Aspects - Sakshi

ఈ ఆగస్టు 15న మనం 75 వారాల అమృత మహోత్సవం పూర్తి చేసుకుంటున్నాం! ఈసారి స్వాతంత్య్ర వేడుకలను అమృత సంకల్ప కాలంగా మార్చడంలోకి భారతదేశం ప్రతి ఒక్కరినీ.. సుప్రసిద్ధులను, సగటు పౌరులను కూడా.. భాగస్వాములను చేసింది. ఎందుకు? ఎందుకంటే ఏ కృషి, ఏ సంకల్పం వృధాగా పోకూడదు. అదొక వేడుకగా జరగాలి. స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం అయితే ఇక చెప్పాల్సిందేముంది?

అదొక మహోత్సవమే అవుతుంది. ‘ఉత్స్‌ వేన్‌ బినా యస్మాత్‌ స్థాపనం నిష్ఫలం భవత్‌’ అని సంస్కృతంలో ఒక మాట ఉంది. అంటే ఏమిటంటే.. ‘వేడుక లేని కృషి, సంకల్పం విజయవంతం కావు’ అని. ఏదైనా సంకల్పం వేడుక రూపం దాల్చినప్పుడు, లక్షలు కోట్ల మంది సంకల్పాలు దానికి తోడైనప్పుడు వాటి శక్తి సమీకృతం అవుతుంది. అదే విధంగా కృషి. ఆ తరహాలోనే స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజా భాగస్వామ్యాన్ని, అంటే ప్రతి ఒక్కరి పాత్రను ప్రోత్సహించింది.

ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని భారత ప్రభుత్వం ఒక విశిష్టమైన మైలురాయిగా మలిచింది. 2047లో స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే నాటికి భారతదేశం ప్రతి రంగంలోనూ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉండాలన్నదే లక్ష్యం. రాబోయే 25న ఏళ్ల అమృతకాలంలో ఈ లక్ష్య సాధనకు అమృత యాత్ర ప్రారంభమైంది. నిర్విరామమైన ఈ పయనంలో వినూత్న స్వావలంబన ప్రమాణాల సృష్టికి భారత్‌ దీక్ష పూనింది. రేపటి నవ భారతానికి సుసంపన్న, ఉజ్వల వారసత్వం దిశగా ఈ ప్రగతి ప్రయాణం ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement