కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు జల్లిన అఖిలేష్‌! | Akhilesh Yadav Blow Congress Hopes | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు జల్లిన అఖిలేష్‌!

Mar 16 2024 9:23 AM | Updated on Mar 16 2024 12:39 PM

Akhilesh Yadav Blow Congress Hopes - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఆరుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) విడుదల చేసింది. దీనికి ముందు మూడు దశల్లో 31 మంది అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గానూ 37 స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే శుక్ర‌వారం విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితాలో న‌గీనా సీటు చర్చనీయాంశంగా మారింది. 

నగీనా లోక్‌సభ స్థానం నుంచి మనోజ్‌ కుమార్‌ పోటీ చేస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మనోజ్ కుమార్ ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే అఖిలేష్‌ యాదవ్‌ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. యూపీలో మరికొన్ని చిన్న పార్టీలను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ ఆజాద్‌కు కంచుకోటగా ఉన్న నగీనా స్థానంలో ఏ అభ్యర్థినీ నిలబెట్టవద్దని కాంగ్రెస్‌ అఖిలేష్‌కు సూచించింది.

అయితే  తాజాగా అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మనోజ్ కుమార్‌ను నగీనా అభ్యర్థిగా చేయడం ద్వారా, చంద్రశేఖర్ ఆజాద్ ఇకపై ఇండియా కూటమిలో చేరలేని పరిస్థితి ఏర్పడింది. యూపీలోని ఖతౌలీ, రాంపూర్‌, మెయిన్‌పూర్‌ ఉపఎన్నికల సమయంలో చంద్రశేఖర్‌ బహిరంగంగానే ఎస్‌పీ కూటమితో బరిలోకి దిగారు.

చంద్రశేఖర్‌  పలు సందర్భాలలో అఖిలేష్ యాదవ్‌ పక్కన కనిపించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఇండియా కూటమిలో ఉంటారని, నగీనా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్‌ నేత ఒకరు ప్రకటించారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ నేడు (శనివారం) నగీనాలో ర్యాలీ నిర్వహించనున్నారు.  ఇక్కడి నుంచే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement