సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQI తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో 50% సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


