ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్‌కు 52 లీటర్ల పెట్రోల్‌! | 45 litre tank But 52 litres of petrol Car Owner Shocked | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్‌కు 52 లీటర్ల పెట్రోల్‌!

Jun 1 2026 8:23 PM | Updated on Jun 1 2026 8:49 PM

45 litre tank But 52 litres of petrol Car Owner Shocked

బంక్‌ల వద్ద పెట్రోల్‌ కొట్టించుకున్న తర్వాత మనం ఇచ్చిన మొత్తానికి అంత పరిమితిలో పెట్రోల్‌ కొట్టారా.. లేదా అనే అనుమానం సాధారణంగా వాహనదారులకు వస్తూ ఉంటుంది. అందుచేత తాము నమ్మిన బంక్‌లకే ఎక్కువగా వెళుతూ ఉంటారు వాహనదారులు. అయితే ఈ తరహాలో జరిగే మోసాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అన్ని బంక్‌లలో ఇలా చేయకపోయినా కొన్ని బంక్‌లు ఈ తరహా మోసాలు చేస్తారనడానికి తాజా ఘటనే నిదర్శనం. 

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ తరహా మోసం వెలుగుచూసింది. కొత్త కారు తీసుకున్న వ్యక్తి ఫుల్‌ ట్యాంక్‌ చేయిద్దామని బంక్‌కు వెళితే అతనికి విపత్కరణ పరిణామం ఎదురైంది. తన కారు ట్యాంక్‌ కెపాసిటీ 45 లీటర్లైతే, 52 లీటర్ల పెట్రోల్‌ కొట్టినట్లు బిల్‌ ఇ‍వ్వడంతో ఒక్కసారిగా అతను షాక్‌ తిన్నాడు. 

తన కారు ట్యాంకు కెపాసిటీ ఎంత అని పలుమార్లు చెక్‌ చేసుకున్న తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ అని, మరి ఇంకా  ఏడు లీటర్ల పెట్రోల్‌ ఎందుకు ఎక్కువైందని ఆ బంక్‌ సిబ్బందిని ప్రశ్నించాడు. కాన్పూర్‌కు చెందిన చరణ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఈ పరాభవం ఎదురుకాగా,  ఆ మోసం ఎలా జరిగిందో వివరించాడు. తొలుత 41 లీటర్ల ఇంధనాన్ని నింపి ఆపేసి, మళ్లీ పెట్రోల్‌ కొట్టడం ప్రారంభించారన్నాడు.  పెట్రోల్‌ కొట్టడాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించగా, ఫుల్‌ ట్యాంక్‌ చేసేటప్పుడు రెండు విడతల్లో కొట్టాలని సిబ్బంది బదులిచ్చారని చరణ్‌ సింగ్‌ తెలిపాడు. 

పెట్రోల్ నింపడంలో ఆలస్యం కావడం, చివరకు మొత్తం 52 లీటర్ల పెట్రోల్ అని పేర్కొన్న బిల్లును చేతికి అందించగానే తాను షాక్‌కు గురైనట్లు తెలిపాడు. దీనిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. మేనేజ్‌మెంట్‌ కూడా సరిగా సమాధానం చెప్పక పోవడంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. 

స్థానిక తూనికలు, కొలతల అధికారుల కుమ్మక్కుతో ఒక వ్యవస్థీకృత మోసాల దందా నడుస్తోందని ఆరోపిస్తూ సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పంపిణీ యంత్రాలలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోనని తనిఖీ చేయడానికి జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement