హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మరీ 12 ఏళ్ల బాలికతో వివాహం
ప్రతీ రోజు నరకం చూపించి, నడిరోడ్డుపై వదిలేసిన వైనం
ఉత్తర ప్రదేశ్లోని పవిత్ర పుణ్య క్షేత్ర వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. కేవలం చీరలు, డబ్బుల కోసం 12 కన్నకూతుర్ని విక్రయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆ బిడ్డ భయంకరమైన వేధింపులు, అత్యాచారాలకు గురైన ఘటన కలకలం రేపింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం 12 ఏళ్ల బాలికను స్వయనా ఆమె తల్లే ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేసింది. అదీ రూ.16,000 , 10 చీరలకు విక్రయించింది. ఆ తరువాత ఆమెకు ఘోరమైన నరకం అంటే ఏంటో చూపించారు. పదేపదే అత్యాచారం చేసి, వారణాసిలో వదిలేశారు.
అసలేం జరిగిందంటే
నిందితుడు 40 ఏళ్ల లహ్రూ యాదవ్ (అలియాస్ రాకేష్) ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లి నుంచి ఆమెను కొనుగోలు చేశాడు. చందౌలీలోని ఒక గుడిలో నకిలీ వివాహం చేసుకున్నాడు. తానేదో చిన్న వయస్కుడిగా కనిపించడం కోసం అతను ఢిల్లీలో దాదాపు రూ. 90,000 ఖర్చు చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకున్నాడు.
పెళ్లి పేరుతో బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన యాదవ్, ఆమెపై అమానుషంగా నిరంతరం అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, పనిమనిషిగా మార్చి చిత్రహింసలు పెట్టాడు. మైనర్ బాలికను ఇంట్లో ఉంచుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని స్థానికులు హెచ్చరించడంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని చూశాడు. మే 19న బనారస్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ బాలికను నిందితుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ రవి వర్మ అనే ఆటో డ్రైవర్, ఆ బాలికకు సహాయం చేసి తల్లి వద్దకు చేరుస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. కానీ, అతను కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమెను మళ్లీ రోడ్డుపై వదిలేశాడు.
మే 21న వారణాసిలోని సార్నాథ్ ప్రాంతంలో బాలిక ఒంటరిగా ఏడుస్తూ తిరుగుతుండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు మే 22న భారతీయ న్యాయ సంహిత (BNS) అత్యాచార సెక్షన్లు, అలాగే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బాలికను అమ్మేసిన సొంత తల్లిని, కొనుగోలు చేసిన లహ్రూ యాదవ్ను, మరియు ఆటో డ్రైవర్ రవి వర్మను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై సమగ్ర విచారణ జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సార్నాథ్ ఏసీపీ విదూష్ సక్సేనా తెలిపారు.


