మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం  | 11 years of Modi govt golden period | Sakshi
Sakshi News home page

మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం 

Jun 10 2025 5:19 AM | Updated on Jun 10 2025 5:19 AM

11 years of Modi govt golden period

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్న రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ:  కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే మూడో టర్మ్‌లో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ 11 ఏళ్లు ప్రజాసేవలో స్వర్ణయుగం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అభివరి్ణంచారు.

మోదీ నాయకత్వంలో నవ భారతదేశం సంస్కరణల శక్తి, మార్పుతో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా ప్రతి రంగంలో మన దేశాన్ని నంబర్‌ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తోందని వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టంచేశారు. 11 ఏళ్ల ఈ చరిత్రాత్మక ప్రయాణం సేవా ప్రయాణమని వివరించారు. ఈ మేరకు అమిత్‌ షా సోమవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 

నాయకత్వం శక్తివంతంగా, సంకల్పం బలంగా, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే  ప్రజాసేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని తెలియజేశారు. మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అచేతనావస్థలో ఉందని, ఎటు చూసినా కుంభకోణాలు తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక 11 ఏళ్లలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రధాని మోదీ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అమిత్‌ షా హర్షం వ్యక్తంచేశారు. రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారతే మోదీ సర్కారు ధ్యేయమని తేలి్చచెప్పారు.   

దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశానికి మోదీ సర్కారు బలమైన రక్షణ కవచంగా మారిందన్నారు. దృఢమైన, గర్వకారణమైన ఐక్య భారత్‌ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కూడా చేరిందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బడుగ బలహీన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూరుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. 

ప్రపంచ వేదికపై సమున్నత భారత్‌: గడ్కరీ   
నరేంద్ర మోదీ దార్శనికత పాలనలో దేశంలో చరిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వివరించారు. సుపరిపాలన, సమగ్రాభివృద్ధిని కళ్లారా చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. దేశం ఎవరూ అందుకోలేనంత వేగంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. బలమైన నాయకత్వం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న పాలనతో ప్రపంచ వేదికపై సగర్వంగా, సమున్నతంగా నిలుస్తోందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, సాంస్కృతిక వైభవం, జాతీయ భద్రత విషయంలో మోదీ పాలన నూతన శకమని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అగ్రనేత చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించాలి: నడ్డా
దేశంలో గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సువర్ణాక్షరాలతో లిఖించదగనవని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement