తిరువనంతపురం: అతని రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సౌదీ అరేబియా జైలులో 20 ఏళ్ల పాటు మగ్గిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్, ఎట్టకేలకు గురువారం ఉదయం తన మాతృభూమికి చేరుకున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో దిగిన రహీమ్ను చూడగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం ఉద్వేగపూరిత వాతావరణంతో నిండిపోయింది.
న్యాయపోరాటంలో గెలిచిన మానవత్వం
2006లో సౌదీ అరేబియాలో ఒక బాలుడి మరణానికి సంబంధించిన కేసులో అబ్దుల్ రహీమ్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి ఆయన జైలులోనే గడిపారు. అయితే జూలై 2024లో మృతుడి కుటుంబం ‘దియా’ (బ్లడ్ మనీ) స్వీకరించడానికి అంగీకరించడంతో ఆయనకు మరణశిక్ష రద్దయ్యింది. ఈ ప్రక్రియ కోసం మలయాళీలు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన భారీ విరాళాల సేకరణ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 34 కోట్లు సమకూర్చారు.
ప్రయాణంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ
రహీమ్ జైలు శిక్ష అధికారికంగా మే 19నే ముగిసినప్పటికీ, సౌదీ జైలు అధికారులు హజ్ విధుల్లో బిజీగా ఉండటంతో విడుదల ఆలస్యమైంది. అయితే, ఈ కేసులోని తీవ్రతను, అత్యవసర పరిస్థితిని గుర్తించిన సౌదీ అధికారులు, ప్రత్యేక ప్రోటోకాల్లను అమలు చేసి విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. బుధవారం అర్ధరాత్రి అన్ని లాంఛనాలను పూర్తి చేసి, రహీమ్ను విమానాశ్రయానికి తరలించారు.
కన్నీటి వీడ్కోలు.. కృతజ్ఞత
రియాద్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఉదయం 8 గంటలకు కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రహీమ్, బయటకు రాగానే కన్నీరు పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, తన విడుదల కోసం కృషి చేసిన వారికి ఆయన చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ఆయన నేరుగా తన స్వగృహానికి బయలుదేరారు. కన్నతల్లిని కలవాలన్న తపన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు


