నారాయణపేట ఎడ్యుకేషన్: రైతులు విత్తనమేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. సోమవారం మండలంలోని జాజాపూర్ రైతువేదికలో మూడురోజుల పాటు కొనసాగే విత్తనమేళాను మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మేళాను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎల్నినో ప్రభావం, వానాకాలం పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంది, పెసర తదితర వంగడాలను రైతులకు పరిచయం చేశారు. రైతులకు ఉపయోగపడే నానో యూరియా, నానో డీఏపీ, కొత్త కూరగాయల వంగడాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ దినకర్, మండల ఉద్యాన అధికారి సమీన, జాజాపూర్ సర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ లక్ష్మణ్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్, ప్రకాష్, అంజమ్మ, అనిల్కుమార్, సుధాకర్, తార, బి.అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేపు స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డైట్, ప్రైవేటు కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల విద్యార్థులకు రెండో దశ స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మెరాజుల్లాఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ డైట్ కళాశాల, గురువారం ప్రైవేటు కళాశాలలకు స్పాట్ కౌన్సెలింగ్ మెట్టుగడ్డ డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. పూర్తి వివరాల కోసం సెల్ నం.99499 93714ను సంప్రదించాలని సూచించారు.
జూరాల–గద్వాల రాకపోకలు నిలిపివేత
అమరచింత(ఆత్మకూర్): ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామ సమీపంలో ఉన్న కృష్ణానది నుంచి గద్వాలకు వెళ్లే కచ్చా రహదారిపై వాహనాల రాకపోకలను సోమవా రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఎస్ఐ జయన్న తెలిపారు. జూరాల పవర్ ప్లాంట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నందున జూరాల గ్రామం మీదుగా గద్వాలకు వెళ్తే మార్గాన్ని మూసివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని సూచించారు.
పల్లీ క్వింటా రూ.7,302
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 3,204 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,302, కనిష్టంగా రూ. 2,019, సరాసరి రూ. 5,890 ధరలు పలికాయి.


